విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు వేసవి శిబిరాలు పునాది
ఘనంగా ప్రారంభమైన ‘గ్రేష్మౌలాసం – 2026’ వేసవి శిక్షణ శిబిరం
పాల్గొన్న అదనపు కలెక్టర్ విజయలక్ష్మి ,మున్సిపల్ అధికారులు
విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా,క్రీడలు సృజనాత్మక నైపుణ్యాలలో రాణించినప్పుడే సంపూర్ణ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోగలరని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పేర్కొన్నారు.శనివారం జిల్లా కేంద్రంలోని షెడ్యూల్డ్ కులాల (ఎస్ సి) బాలికల కళాశాల వసతి గృహంలో ఏర్పాటు చేసిన “గ్రేష్మౌలాసం – 2026” వేసవి శిక్షణ శిబిరాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ,వేసవి సెలవులను విద్యార్థులు కాలక్షేపానికి వాడుకోకుండా, తమలోని ప్రతిభను వెలికితీసేందుకు ఒక వేదికగా మలుచుకోవాలని సూచించారు.”నేటి పోటీ ప్రపంచంలో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం అత్యంత అవసరం. క్రీడల్లో పాల్గొనడం వల్ల క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు అలవడతాయి. ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన ఆలోచనలు ఉంటాయి” అని ఆయన విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇటువంటి శిబిరాలను సద్వినియోగం చేసుకొని,భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు.అదనపు కలెక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ,విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం ఈ శిక్షణ శిబిరాలను పర్యవేక్షిస్తోందని తెలిపారు.విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించడంతో పాటు,నిపుణులైన శిక్షకులతో శిక్షణ ఇప్పించడం జరుగుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులు, టౌన్ ప్రెసిడెంట్, స్థానిక కౌన్సిలర్లు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.