గులాబీ జెండా ఎగరడం ఖాయం -కేటీఆర్
కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి
కేటీఆర్ నాయకత్వంలోనే భూపాలపల్లి అభివృద్ధి–గండ్ర వెంకటరమణారెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.మున్సిపల్ ఎన్నికల సందర్భంగా భూపాలపల్లికి విచ్చేసిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వానికి తనదైన శైలిలో చురకలు అంటించారు.అభివృద్ధి పనులను పక్కనపెట్టి, కేవలం రాజకీయ ప్రకటనలు, హామీలకే పరిమితమైన కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు.భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాకు వచ్చిన కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలతో సమావేశమై మాట్లాడారు.తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని, అదే అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసిందని ఆరోపించారు.
బిఆర్ఎస్ అంటే అభివృద్ధి – కాంగ్రెస్ అంటే నిర్లక్ష్యం
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని కేటీఆర్ గుర్తు చేశారు.ముఖ్యంగా భూపాలపల్లిని ఒక చిన్న పట్టణం నుంచి అభివృద్ధి చెందిన మున్సిపాలిటీగా మార్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు.రోడ్లు, డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్, పార్కులు, మార్కెట్ యార్డులు, బైపాస్ రోడ్డు వంటి కీలక అభివృద్ధి పనులకు గత ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు చేశామని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆమోదించిన ప్రాజెక్టులనే ముందుకు తీసుకెళ్లలేకపోయిందని,కొత్తగా ఒక్క అభివృద్ధి పనికీ శ్రీకారం చుట్టలేదని విమర్శించారు.కేటీఆర్ మున్సిపల్ మంత్రి హయాంలో భూపాలపల్లి బైపాస్ రోడ్డుకు రూ.150 కోట్ల నిధులు మంజూరు చేసినప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం ఆ పనిని పట్టించుకోవడం లేదన్నారు.
గండ్ర వెంకటరమణారెడ్డి సేవలు – భూపాలపల్లి చరిత్రలో చిరస్థాయి
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, భూపాలపల్లి అభివృద్ధి అంటే తన రాజకీయ జీవితమని అన్నారు. తన ఎమ్మెల్యే పదవీకాలంలో ప్రజల అవసరాలను గుర్తించి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు.
తాగునీరు, రహదారులు, విద్యా సంస్థలు, వైద్య సేవలు, పారిశుధ్యం వంటి రంగాల్లో భూపాలపల్లి రూపురేఖలను మార్చిన ఘనత బీఆర్ఎస్ నాయకత్వానిదేనన్నారు.ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమయ్యారని గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. ప్రజలకు అవసరమైన పనులు చేయకుండా, గత ప్రభుత్వాన్ని విమర్శించడమే తమ పని అన్నట్టుగా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ప్రభుత్వ హామీలు మాటలకే పరిమితం
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని కేటీఆర్ అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, మహిళలకు భద్రత, రైతులకు పూర్తి రుణమాఫీ, కార్మికులకు సంక్షేమం అన్నీ మాటలకే పరిమితమయ్యాయని విమర్శించారు.
సింగరేణి కార్మికుల సంక్షేమం విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నెలనెలా మెడికల్ బోర్డులు నిర్వహించి కారుణ్య నియామకాలు కల్పించిందని గుర్తు చేశారు.
భూపాలపల్లి ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ వైపే
భూపాలపల్లి ప్రజలు అభివృద్ధిని కోరుకునే వారని, పనిచేసే నాయకత్వానికే ఓటు వేస్తారని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, నిర్లక్ష్యాన్ని ప్రజలు గమనిస్తున్నారని, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.ఈ ఎన్నికలు భూపాలపల్లి భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ పాలన తప్పనిసరి అని చెప్పారు. గులాబీ జెండా విజయం భూపాలపల్లికి మళ్లీ అభివృద్ధి బాట వేస్తుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు బిఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.