చిన్నారిపై జరిగిన ఘటన అత్యంత దారుణం
బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే జీఎస్సార్
రేగొండ మండలం పొనగండ్ల గ్రామానికి చెందిన చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు (జీఎస్సార్) అన్నారు.ఈ ఘటన అత్యంత దారుణమైనదని,సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసే ఘటనగా ఆయన పేర్కొన్నారు.సోమవారం ఉదయం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత చిన్నారిని ఎమ్మెల్యే పరామర్శించి, ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.అభం శుభం తెలియని చిన్నారిపై ఇలాంటి అమానుష ఘటన జరగడం అత్యంత హేయకరమని, సమాజం తలదించుకునే ఘటనగా అభివర్ణించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీతో మాట్లాడిన ఎమ్మెల్యే, ఘటనకు పాల్పడిన నిందితులను వెంటనే గుర్తించి, చట్టపరంగా అత్యంత కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తాను పోరాడతానని తెలిపారు.బాధిత చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు ప్రభుత్వం ద్వారా అందేలా చూస్తామని ఎమ్మెల్యే తెలిపారు. బాధిత కుటుంబానికి న్యాయ సహాయం, భద్రత కల్పించడంలో ఎలాంటి లోటుపాట్లు ఉండవని స్పష్టం చేశారు.