తెలుగు గళం కథనానికి అదిరిపోయే స్పందన
తెలుగు గళం కథనానికి అదిరిపోయే స్పందన
రేగొండ మండల కేంద్రంలో ప్రజల దాహార్తిని తీర్చాల్సిన చలివేంద్రాల దుస్థితిపై ‘తెలుగు గళం’ దినపత్రికలో వచ్చిన కథనం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది.ఎండలు ముదురుతున్న తరుణంలో చలివేంద్రాలు ఉత్సవ విగ్రహాలుగా మారాయని, కుండల్లో చుక్క నీరు లేక ప్రయాణికులు అల్లాడుతున్నారని “చలివేంద్రం ఉందా.. చనిపోయిందా? రేగొండలో ప్రయాణికుల దాహార్తి” అనే శీర్షికతో వెలువడిన వార్తకు రేగొండ గ్రామ పంచాయతీ పాలకవర్గం తక్షణమే స్పందించింది.పత్రికా కథనం ప్రచురితమైన కొద్ది గంటల్లోనే అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టారు.మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణ, రద్దీగా ఉండే ప్రధాన కూడళ్లు, ఇతర ముఖ్య ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాల వద్దకు పంచాయతీ సిబ్బంది ద్వారా నీటిని సరఫరా చేయించారు. ఖాళీగా దర్శనమిస్తున్న కుండలను శుభ్రం చేసి, పైపుల ద్వారా మంచినీటిని నింపి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. నీటి సౌకర్యం పునరుద్ధరించబడటంతో ప్రయాణికులు, పాదచారులు, స్థానిక వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులు మాట్లాడుతూ.. చలివేంద్రాలు ఉన్నా నీరు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డామని, ‘తెలుగు గళం’ పత్రిక మా సమస్యను పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం సంతోషకరమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం గళమెత్తుతున్న పత్రికా యాజమాన్యానికి, తక్షణమే స్పందించి నీటిని నింపిన రేగొండ గ్రామ పంచాయతీ పాలకవర్గానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై వేసవి కాలం ముగిసే వరకు ప్రతిరోజూ చలివేంద్రాలను పర్యవేక్షించి, నిరంతరం మంచినీరు అందుబాటులో ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.