బస్సులో బంగారం పర్సు మిస్సింగ్–దొరికిన వారు తిరిగి ఇవ్వాలని బాధితురాలి విజ్ఞప్తి


ఈ69న్యూస్ జఫర్ఘడ్ మే06
స్టేషన్ ఘనపూర్ నుండి హిమ్మత్ నగర్ గ్రామానికి వెళ్తున్న వరంగల్ 1 డిపో బస్సులో బంగారం ఉన్న పర్సు మిస్సింగ్ అయిన ఘటన స్థానికంగా ఆందోళనకు గురిచేసింది.హైదరాబాద్ నుండి తమ్మడపల్లి జి గ్రామానికి వివాహ కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం బయలుదేరిన ముహమ్మద్ సైదాబీ, సాహెబ్ హుస్సేన్ దంపతులు స్టేషన్ ఘనపూర్ నుండి జఫర్ఘడ్ వరకు ప్రయాణం చేస్తూ ఈ ఘటనకు గురయ్యారు.ప్రయాణ సమయంలో జఫర్ఘడ్ వరకు టికెట్ తీసుకునే సమయంలో పర్సులోని కొంత నగదు తీసి, పర్సును పక్కన పెట్టి మరిచిపోయినట్లు బాధితురాలు తెలిపింది.అనంతరం జఫర్ఘడ్ వద్ద బస్సు దిగి తమ్మడపల్లి జి గ్రామానికి చేరుకున్న తర్వాత పర్సు కనిపించకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైంది. వెంటనే తమ్మడపల్లి జి నుండి జఫర్ఘడ్కు తిరిగి వచ్చి బస్సును వెతికినా, అప్పటికే ఆ బస్సు హిమ్మత్ నగర్ నుండి తిరిగి హన్మకొండకు వెళ్లిపోయినట్లు తెలిసింది.ఆ పర్సులో సుమారు 2 తులాల నల్లపూసల బంగారం గొలుసు మరియు రూ. 3,000 నగదు ఉన్నట్లు బాధితురాలు వెల్లడించింది. ఈ ఘటనపై వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి బస్సు సిబ్బంది, ప్రయాణికుల వివరాలు సేకరిస్తూ విచారణ కొనసాగిస్తున్నారు.పెళ్లి కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరగడంతో బాధితురాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.తనకు చెందిన పర్సు దొరికిన వారు మానవతా దృక్పథంతో స్పందించి తిరిగి అందజేయాలని ఆమె వినయపూర్వకంగా విజ్ఞప్తి చేసింది.