2024-25 విద్యా సంవత్సరంలో అన్ని రకాల గురుకుల పాఠశాలలో( ఎస్సీ, ఎస్టీ,బీసీ,జనరల్) కేజీ టు పీజీ మిషన్ లో భాగంగా బంగారు తెలంగాణ రూపొందించే క్రమంలో దళిత గిరిజన బహుజనలలో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు బంగారు భవిష్యత్తును వేయడానికి ఐదవ తరగతిలో ఇంగ్లీష్ మీడియం లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గిరిజన గురుకుల విద్యాలయాలలో ప్రవేశం పొందుటకు గాను అర్హత కలిగిన విద్యార్థిని, విద్యార్థుల నుండి అంతర్జాలం (ఆన్లైన్లో )దరఖాస్తులు కోరుతున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు.
అభ్యర్థులు తమ అర్హతలను పరిశీలించుకొని తేదీ 18 డిసెంబర్ 23 నుండి తేదీ 6 జనవరి 2024 వరకు అంతర్జాలం (ఆన్లైన్లో) 100/- రూపాయలు రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన అన్నారు. దరఖాస్తు చేయడానికి అభ్యర్థి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, అభ్యర్థి సంతకం, ఆధార్ కార్డు, పుట్టిన తేదీ మరియు మొబైల్ నెంబర్ను పొందుపరచాలని, ప్రవేశ పరీక్ష తేదీ 11 ఫిబ్రవరి 24 ఉదయం 11-00గంటల నుండి మధ్యాహ్నం 1-00 గంట వరకు జిల్లాలోని ఎంపిక చేయబడిన కేంద్రాలలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
ఇట్టి పాఠశాలల్లో ప్రవేశం పొందుటకు కావలసిన పూర్తి సమాచారం కొరకు http://tgcet.cgg.gov.in మరియు https://www.tgtwgurukulam.Telangana.gov.in/నందు గాని లేదా సమీపంలోని ఏదైనా గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయములను గాని సంప్రదించాలని, దీనికి సంబంధించి గురుకులాల యొక్క ప్రత్యేకతలు మరియు విద్యార్థులకు అందించుచున్న సౌకర్యాలను మరియు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వెంకటేశ్వర రాజు ప్రాంతీయ సమన్వయ అధికారి ఖమ్మం రీజియన్ తెలిపారు.