ఎస్ఐఆర్ కార్యక్రమంలో ప్రతీ కుటుంబం పాల్గొనాలి
తమ్మడపల్లి జి గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ అన్నం బ్రహ్మారెడ్డి
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా పునఃపరిశీలన (ఎస్ఐఆర్)కార్యక్రమంలో ప్రతి కుటుంబం చురుకుగా పాల్గొనాలని తమ్మడపల్లి జి గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ అన్నం బ్రహ్మారెడ్డి గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత పౌరుల వివరాల ధృవీకరణ, ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఉన్న ఓటరు నమోదులను సరిచేయడం, అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా ప్రభుత్వం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు.గ్రామానికి చెందిన ప్రతి కుటుంబం తమ పేరు, కుటుంబ సభ్యుల వివరాలు ఓటరు జాబితాలో సక్రమంగా నమోదయ్యాయో లేదో తప్పనిసరిగా పరిశీలించుకుని, అవసరమైతే సవరణలు చేయించుకోవాలని సూచించారు.ఓటరు జాబితాలో పేరు ఉండటం ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడి హక్కు అని, ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇది అత్యంత కీలకమని పేర్కొన్నారు.ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా సంబంధిత బిఎల్వోలు ఇంటింటికీ వచ్చి వివరాలను సేకరిస్తారని, అలాగే గ్రామానికి చెందిన పదో తరగతి చదువుతున్న విద్యార్థులు స్వచ్ఛందంగా సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు.గ్రామ ప్రజలు వారికి అవసరమైన పత్రాలు అందించి పూర్తి సహకారం అందించాలని కోరారు.”ప్రతి కుటుంబం తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలి. మన హక్కు–మన బాధ్యత” అనే నినాదంతో గ్రామ ప్రజలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ అన్నం బ్రహ్మారెడ్డి విజ్ఞప్తి చేశారు.