పీఆర్పీ, పే అప్గ్రేడేషన్ అమలు చేయాలి
సింగరేణి అధికారులకు పెండింగ్లో ఉన్న పీఆర్పీని వెంటనే విడుదల చేయడంతో పాటు పే అప్గ్రేడేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఎంఓఏఐ) ఆధ్వర్యంలో సత్తుపల్లి ఏరియా జీఎం కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం ఐదో రోజుకు చేరుకున్నాయి.
ఐదో రోజు దీక్షలో అడిషనల్ మేనేజర్ గోపి కిషోర్, డిప్యూటీ మేనేజర్ నూకరాజు, సీనియర్ ఇంజనీర్ (సివిల్) రవి కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ అభివృద్ధికి అధికారులు నిరంతరం శ్రమిస్తున్నప్పటికీ, వారి న్యాయమైన డిమాండ్లను యాజమాన్యం నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. పెండింగ్లో ఉన్న పీఆర్పీని తక్షణమే చెల్లించి, అర్హులైన అధికారులందరికీ పే అప్గ్రేడేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు ఉద్యమాన్ని విరమించే ప్రసక్తే లేదని, యాజమాన్యం స్పందించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీక్షలకు సత్తుపల్లి ఏరియాకు చెందిన పలువురు అధికారులు, అసోసియేషన్ నాయకులు, ఉద్యోగులు సంఘీభావం ప్రకటించారు.