పేకాట స్థావరంపై పోలీసుల దాడి:ఆరుగురు అరెస్ట్
రేగొండ మండల పరిధిలోని తిరుమలగిరి గ్రామ స్మశాన వాటికలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట స్థావరంపై గత రాత్రి స్థానిక పోలీసులు అకస్మిక దాడి చేశారు.ఎస్ఐ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలగిరి స్మశాన వాటిక పరిసరాల్లో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో పోలీసులు ఆ ప్రదేశంపై రైడ్ నిర్వహించారు.ఈ దాడిలో పేకాట ఆడుతూ రెడ్ హ్యాండెడ్గా దొరికిన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 3,010 నగదుతో పాటు పేక ముక్కలను స్వాధీనం చేసుకుని,వారిపై చట్టపరంగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.ఈ దాడులలో పోలీస్ కానిస్టేబుళ్లు శ్రీధర్, నరేష్, శ్రీశైలం పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్ఐ సుధాకర్ మాట్లాడుతూ.. మండలంలోని ఏ గ్రామంలోనైనా జోరుగా పేకాట గాని, ఇతర జూద క్రీడలు గాని ఆడితే సహించేది లేదని హెచ్చరించారు. గ్రామాల్లో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించి,వారిని పట్టుకుని చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.