మహబూబాబాద్ జిల్లా గళం న్యూస్:-
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఫామ్ హౌస్ కేడీ తెలంగాణను దోపిడీ చేశారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మహబూబాబాద్లో కాంగ్రెస్ ‘జన జాతర’ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో కేసీఆర్, మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
దిగిపో దిగిపో అంటున్నావ్. ఉత్తగ వచ్చామా బిడ్డా అని కేసీఆర్కు రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరో పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని జోస్యం చెప్పారు. ఆగష్టు 15వ తేదీలోగా రైతులకు రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. రైతులకు రూ. 500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారు.
మానుకోట కాంగ్రెస్ కంచుకోట అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మహబూబాబాద్ ప్రాంతం విధ్వంసమైందని దుయ్యబట్టారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెచ్చిన చట్టాలకు కేసీఆర్ మద్దతు తెలిపారని అన్నారు. తండ్రి రెడ్యానాయక్ను ఇంటికి పంపినట్టే బిడ్డ మాలోతు కవితను కూడా ఇంటికి పంపాలని రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు.
బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని మోదీ ప్రభుత్వం పక్కకు పెట్టిందని మండిపడ్డారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సోనియా గాంధీ మంజూరు చేస్తే… మోదీ లాథూర్కు తరలించుకుపోయారని విరుచుకుపడ్డారు. ములుగు గిరిజన యూనివర్సిటీని సోనియా గాంధీనే మంజూరు చేశారని గుర్తుచేశారు.
ఈ ప్రాంత ప్రజలను ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకి లేదని చెప్పారు. తల్లిని చంపి బిడ్డను ఇచ్చారని మోదీ తెలంగాణను అవమాన పరిచారని ధ్వజమెత్తారు. అప్పుడు పార్లమెంట్లోతానే ప్రత్యక్ష సాక్షినని గుర్తుచేశారు. ఉత్తర భారతదేశంలోని కుంభమేళాకు మోదీ వేల కోట్లు ఖర్చు చేశారని.. మేడారం జాతరకు కేవలం రూ.3 కోట్లు ఇచ్చారని దుయ్యబట్టారు.
మేడారం మహాజాతరకు జాతీయ గుర్తింపు ఇవ్వబోమని చెప్పిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డికి ఓట్లు అడగడానికి సిగ్గు లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ బిడ్డ కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్ను కేసీఆర్ మోదీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. కేంద్ర మంత్రి పథవుల్లోనూ తెలంగాణకు అన్యాయం చేశారని విరుచుకుపడ్డారు. ఢిల్లీలో రైతులను మోదీ ప్రభుత్వం కాల్చి చంపిందని ఆరోపించారు. 100రోజుల్లో ఐదు గ్యారంటీలు అమలు చేశామని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు.మోదీ ప్రభుత్వంలో భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతోందని మంత్రి సీతక్క అన్నారు. మహబూబాబాద్ జిల్లాలో జరిగిన కాంగ్రెస్ ‘జన జాతర’ భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరయ్యారు. రేవంత్ వేదికపైకి వచ్చే క్రమంలో పెద్ద పెట్టున నినాదాలతో సభ మార్మోగింది. సీతక్క ప్రసంగానికి రాగానే ఈలలు, కేకలతో సభ హోరెత్తింది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ… సీఎం రేవంత్ గ్యారంటీలకే గ్యారంటీ అని తెలిపారు. ఈ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతున్నాయని చెప్పారు.గాడ్సే-గాంధీ సిద్ధాంతాల మధ్య జరుగుతున్న ఎన్నికల్లో నేటి గాంధీ రాహుల్ గాంధీకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. పేదల కష్టాలు తీర్చే పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు. దేవుడికి భక్తుడికి అనుసంధానంగా ఉండే అగర్ బత్తిపైనా మోదీ పన్నులు వేశారని మండిపడ్డారు.గాంధీ కుటుంబానికి లోక్సభ ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.బలరాంనాయక్ గెలిస్తే కేంద్రమంత్రి కావడం ఖాయమని మంత్రి సీతక్క జోస్యం చెప్పారు.
ఆ గోతిలో వారే పడతారు: మంత్రి తుమ్మల
100 రోజుల్లోనే తెలంగాణ పాలనను ఇతర రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సీఎం పదవి కోసం బీఆర్ఎస్, బీజేపీ గోతికాడ నక్కలా కాచుకొని ఉన్నాయని.. ఆ గోతిలో వారే పడిపోవడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించి రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని జోస్యం చెప్పారు.
కేసీఆర్కి మంత్రి పొంగులేటి వార్నింగ్
వరంగల్ మిరపకాయ అంటే ఎంటో రేవంత్ రెడ్డికి తెలుసునని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సమయం వచ్చినప్పుడు అది ఎక్కడ పెట్టాలో రేవంత్ రెడ్డికి తెలుసునని కేసీఆర్ని హెచ్చరించారు. కేసీఆర్ జాగ్రత్తా… రేవంత్ను లిల్లిఫుట్తో పోలుస్తావా అని వార్నిగ్ ఇచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్కు దమ్ముంటే గతంలో మీరు గెలిచిన నాలుగు సీట్లు గెలిచి చూపించాలని సవాల్ విసిరారు.