లారీ ట్రాన్స్పోర్ట్ రంగం సమస్యల పరిష్కారానికి కృషి:ఎమ్మెల్యే గండ్ర
రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో లారీ ట్రాన్స్పోర్ట్ రంగం అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శుక్రవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన భూపాలపల్లి లారీ అసోసియేషన్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వ్యవసాయ ఉత్పత్తులు,పారిశ్రామిక వస్తువులు, నిర్మాణ సామగ్రి వంటి అన్ని రకాల సరుకుల రవాణా లారీ యజమానులు, డ్రైవర్ల ద్వారానే సజావుగా సాగుతుందన్నారు.ప్రస్తుతం లారీ యజమానులు ఎదుర్కొంటున్న నిర్వహణ వ్యయాలు, విడిభాగాల ధరలు, ఇంధన ధరల పెరుగుదల వంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.భూపాలపల్లి నియోజకవర్గం, జిల్లా పరిధిలో ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు సంబంధించిన రవాణా అవసరాలు, వివిధ సరఫరా పనుల్లో స్థానిక లారీ యజమానులకే మొదటి ప్రాధాన్యత కల్పించే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.అలాగే భూపాలపల్లి ప్రాంత అభివృద్ధిలో భాగంగా, గుడెప్పాడ్ నుండి భూపాలపల్లి వరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టే ఫోర్లేన్ (నాలుగు వరుసల) రహదారి నిర్మాణాన్ని తమ హయాంలోనే పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ప్రకటించారు.ఇటీవల జరిగిన లారీ అసోసియేషన్ ఎన్నికల్లో విజయం సాధించి, నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన పులి వేణుగోపాల్తో పాటు పాలకవర్గ సభ్యులందరికీ ఎమ్మెల్యే హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. లారీ ట్రాన్స్పోర్ట్ రంగాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు, కార్మికుల సంక్షేమానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు బట్టు కరుణాకర్, స్థానిక మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, లారీ అసోసియేషన్ ప్రతినిధులు, లారీ యజమానులు, డ్రైవర్లు,పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.