లింగాల గ్రామం నుంచే భూ సర్వేకు శ్రీకారం:ఎమ్మెల్యే గండ్ర
మండల పరిధిలోని లింగాల గ్రామం నుంచే భూ సర్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం సంతోషకరమని, ప్రజలందరూ సహకరించి ఈ సర్వేను పారదర్శకంగా పూర్తి చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పిలుపునిచ్చారు.శుక్రవారం లింగాల గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ భూ సర్వే అవగాహన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రేగొండ మండలంలో మొట్టమొదటగా ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ లింగాల గ్రామంలోనే జరిగిందని గుర్తుచేశారు. ఇప్పుడు భూ సర్వే కార్యక్రమానికి కూడా ఇదే గ్రామాన్ని ఎంపిక చేయడం విశేషమన్నారు. లింగాల గ్రామాన్ని అన్ని విధాలుగా మోడల్ గ్రామంగా అభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.భూ సర్వే సమయంలో భూయజమానులు, గ్రామ ప్రజలు పూర్తిస్థాయిలో అధికారులకు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. సర్వే నిర్వహణలో ఏవైనా భూ సమస్యలు లేదా సందేహాలు ఉంటే వాటిని తక్షణమే సంబంధిత రెవెన్యూ అధికారులు, సర్పంచ్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలని, ఎక్కడా వివాదాలకు తావులేకుండా విజయవంతంగా పూర్తి చేసుకోవాలని సూచించారు.అదేవిధంగా భూపాలపల్లి నియోజకవర్గంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన రేగొండ మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని ప్రభుత్వం తరపున ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. కొడవటంచ ఆలయాన్ని తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం తరహాలో అద్భుతంగా తీర్చిదిద్దే దిశగా అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు.ఈ అవగాహన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సురేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ గుటోజు కిష్టయ్య, ఎంపీడీవో, రెవెన్యూ అధికారులు, వివిధ శాఖల ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.