శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిపై రాజకీయ విషం
శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిపై రాజకీయ విషం
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూరునగర్ లో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం వేదికగా రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని, అధికార పక్ష నేతల ఒత్తిళ్లకు లొంగి దేవాదాయ శాఖ అధికారులు బరితెగించి ప్రవర్తిస్తున్నారని ఆలయ ధర్మకర్త,మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.శుక్రవారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ భక్తుల సమావేశంలో వారు మాట్లాడుతూ, గత రెండు ఏళ్లుగా ఆలయ అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా కుటిల రాజకీయాలు సాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ అధికారులు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు ప్రజాస్వామ్య విరుద్ధమని వారు మండిపడ్డారు.ఈ సందర్భంగా గండ్ర దంపతులు మాట్లాడుతూ.. లోక కల్యాణార్థం, భక్తుల అపారమైన సహాయ సహకారాలతో ఎంతో నిష్ఠతో అత్యంత తక్కువ కాలంలోనే ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి, స్వామివారి విగ్రహ ప్రతిష్ఠాపనను అంగరంగ వైభవంగా నిర్వహించామని గుర్తు చేశారు.విగ్రహ ప్రతిష్ఠ నాటి నుండి నేటి వరకు ప్రతిరోజూ స్వామివారికి జరిగే నిత్య కైకర్యాలు, విశేష పూజా కార్యక్రమాలు, శనివారపు అన్నదానాలను తాము తమ సొంత నిధులతో పాటు భక్తుల చందాలతో నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నామని తెలిపారు.ఇక్కడ భక్తి వెల్లివిరుస్తుంటే చూసి ఓర్వలేక,రాజకీయంగా లబ్ధి పొందాలనే దురాశతో కొంతమంది ఆలయంపై కేసులు వేస్తూ అభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. “జిల్లాలో దూపదీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాలు ఎన్నో ఉన్నా వాటిని పట్టించుకోని వీరు, నిత్యం భక్తులతో కళకళలాడే ఈ ఆలయంపై ఎందుకు కక్ష గట్టారు?” అని నిలదీశారు.ముఖ్యంగా, హైకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఉన్నప్పటికీ వాటిని దిక్కరించి దేవాదాయ శాఖ అధికారులు వ్యవహరించడం శోచనీయమని వారు పేర్కొన్నారు. ఆలయ ధర్మకర్తలుగా ఉన్న తమకు కనీస ముందస్తు నోటీసులు ఇవ్వకుండా,హడావిడిగా ఒక కమిటీని నియమించి, ఈరోజు ఆ కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించాలని చూడటం అత్యంత దుర్మార్గమైన చర్య అని దుయ్యబట్టారు. గత ఎనిమిది నెలల క్రితం కమిటీ నియామకానికి నోటీసు ఇచ్చినప్పుడు, తాము నిబంధనల ప్రకారం ఐదుగురు అభ్యర్థుల దరఖాస్తులను సమర్పించామని, కానీ అధికారులు రాజకీయ నాయకుల బెదిరింపులకు భయపడి ఆ దరఖాస్తులను బుట్టదాఖలు చేశారని ఆరోపించారు.అధికార పార్టీ నేతలు ఇచ్చిన పేర్లనే కమిటీ సభ్యులుగా ప్రకటించి,అడ్డదారిలో ఆలయ పాలనను హస్తగతం చేసుకోవాలని చూడటం భక్తులకు చేస్తున్న ద్రోహమని వారు వ్యాఖ్యానించారు.దేవుడి పేరుతో రాజకీయాలు చేసే వారికి పుట్టగతులు ఉండవని,కుట్రలతో ఆలయ పవిత్రతను దెబ్బతీయాలని చూస్తే భక్తులే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.దేవాదాయ శాఖ అధికారులు ఇకనైనా తమ ఏకపక్ష ధోరణిని వీడి, చట్టబద్ధంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.ఈ రాజకీయ కుట్రలపై తాము న్యాయపోరాటం చేస్తామని, స్వామివారి ఆలయ అభివృద్ధిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగిపోనివ్వబోమని గండ్ర దంపతులు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు జై వేంకటేశ్వర అంటూ నినాదాలు చేస్తూ తమ సంఘీభావాన్ని ప్రకటించారు.ప్రాంతీయ భక్తులు, మహిళలు, గ్రామ పెద్దలు ఈ నిరసనలో పాల్గొని అధికారుల తీరును తీవ్రంగా ఖండించారు.