ప్రతి చుక్క నీరు రైతుకు ప్రాణాధారం
ప్రతి చుక్క నీరు రైతుకు ప్రాణాధారం
ఆయకట్టు అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది:ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వ్యవసాయ రంగ సుస్థిర అభివృద్ధికి నీటి వినియోగం అత్యంత కీలకమని, సాగునీటిని వృధా చేయకుండా ప్రతి చుక్కను సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు (జీఎస్సార్) రైతులకు పిలుపునిచ్చారు.శనివారం జిల్లాలో కొనసాగుతున్న ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ రైతు వారోత్సవాలలో భాగంగా శాయంపేట,ఘనపూర్ మండలాల్లో నీటి పారుదల,ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు పురాతన పద్ధతులను వీడి శాస్త్రీయ పద్ధతుల్లో పంటల సాగును కొనసాగించాలని,అప్పుడే తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించడం సాధ్యమవుతుందని సూచించారు.ఆయకట్టు ప్రాంతాల అభివృద్ధి, కాలువల సంరక్షణ మరియు నీటి పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారానే రైతులకు అసలైన లాభం చేకూరుతుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వివరించారు.కాలువల వెంబడి నీటి వృధాను అరికట్టాలని,చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని ఆదేశించారు.ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని,సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, ఆధునీకరణ కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు.రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి,వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు తాము నిరంతరం శ్రమిస్తున్నామని ఆయన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు,శాయంపేట,ఘనపూర్ మండలాల సర్పంచ్లు,మండల పార్టీ అధ్యక్షులు,వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు,ముఖ్య నాయకులు,పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు సాగునీటి యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు.