యూరియా పాత విధానంలోనే పంపిణీ చేయాలి: సీపీఎం
రైతులకు అవసరమైన మేర యూరియాను కొరత లేకుండా అందుబాటులో ఉంచి, రైతు ఫర్టిలైజర్ యాప్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే పంపిణీ చేపట్టాలని సీపీఎం జిల్లా నాయకులు మోరంపూడి పాండురంగారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సత్తుపల్లిలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు ఫర్టిలైజర్ యాప్ కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నెట్వర్క్, సాంకేతిక సమస్యలతో ఎరువుల దుకాణాల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ పనులు కీలక దశలో ఉన్న సమయంలో యూరియా కొరత ఏర్పడితే రైతులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పాత విధానంలోనే యూరియా పంపిణీ కొనసాగించి, అవసరమైన మేర నిల్వలు ఉంచి సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణ రైతు సంఘం సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి రావుల రాజబాబు మాట్లాడుతూ, రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేకుంటే రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
విలేకరుల సమావేశంలో సీపీఎం సత్తుపల్లి పట్టణ కార్యదర్శి కోలికపోగు సర్వేశ్వరరావు, నాయకులు మోరంపూడి వెంకట్రావు, చావా రమేష్, చప్పిడి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.