మీసేవ కేంద్రాల ద్వారా కాగిత రహిత (పేపర్లెస్) సేవలు:ఈడీఎం శ్రీకాంత్
మీసేవ కేంద్రాల ద్వారా వివిధ ప్రభుత్వ సేవల కోసం దరఖాస్తు చేసుకునే వారికి కాగిత రహిత (పేపర్లెస్) సేవలు జిల్లాలో మరింత విస్తరించనున్నాయని జిల్లా ఈ-గవర్నెన్స్ మేనేజర్ (ఈడీఎం) శ్రీకాంత్ తెలిపారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో డీఆర్డీఓ బాలకృష్ణ, డీపీఎం రవిలతో కలిసి ఆయన మీసేవ కేంద్రాల ఆపరేటర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సేవల్లో పారదర్శకత, వేగం పెంచేందుకు రాష్ట్ర ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (మీసేవ) కమిషనర్ నూతనంగా ఒక మొబైల్ అప్లికేషన్ను అందుబాటులోకి తీసుకొచ్చారని,దీనిపై ఆపరేటర్లకు, ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు.గతంలో కేవలం ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీకే పరిమితమైన ఈ మొబైల్ యాప్ విధానాన్ని, ప్రస్తుతం రెవెన్యూ శాఖలోని అన్ని కేటగిరీల సేవలకు విస్తరించినట్లు ఈడీఎం వెల్లడించారు.ఇకపై నివాస,కుటుంబ సభ్యుల ధ్రువీకరణ, ఈబీసీ, ఓబీసీ వంటి రెవెన్యూ సేవల వెరిఫికేషన్ కోసం దరఖాస్తుదారులు ఎలాంటి భౌతిక పత్రాలను (ఫిజికల్ డాక్యుమెంట్లు) సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి పరిశీలన సమయంలో దరఖాస్తుదారులపై భౌతిక పత్రాల కోసం ఎలాంటి ఒత్తిడి తీసుకురావద్దని రాష్ట్ర కమిషనర్ ఇప్పటికే అన్ని మండలాల తహసీల్దార్లకు స్పష్టమైన సర్క్యులర్ జారీ చేశారని గుర్తుచేశారు.ఈ నూతన విధానం ద్వారా మీసేవ కేంద్రాల్లో ఆన్లైన్ అప్లోడ్ చేసిన పత్రాలను,దరఖాస్తుల వివరాలను అధికారులు తమ మొబైల్ యాప్లోని లాగిన్ ఐడీ,పాస్వర్డ్ల ద్వారా నేరుగా పరిశీలించి,అక్కడికక్కడే సర్టిఫికేట్లు జారీ చేయవచ్చని తెలిపారు. దీనివల్ల తక్కువ సమయంలో ఎక్కువ వినతులు పరిష్కారమై ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయన్నారు.దరఖాస్తుదారుల నుండి అధికారులు నేరుగా ఎలాంటి కాగితాలు తీసుకోకూడదని సీసీఎల్ఏతో పాటు జిల్లా యంత్రాంగం నుంచి తహసీల్దార్లు, జీపీఓలకు ఆదేశాలు ఉన్నాయని పేర్కొన్నారు.అదేవిధంగా మీసేవ కేంద్రాల నిర్వాహకులు కూడా దరఖాస్తుదారులను భౌతిక పత్రాల కోసం ఇబ్బంది పెట్టకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఈడీఎం శ్రీకాంత్ హెచ్చరించారు.