పాము కాటుతో మహిళ మృతి
జనగామ జిల్లా జఫర్గడ్ మండలం తిడుగు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.నిద్రిస్తున్న సమయంలో పాము కాటుకు గురైన ఓ మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు, తిడుగు గ్రామానికి చెందిన మారిపెల్లి సౌందర్య (49), భర్త అంజయ్య, పిల్లలతో కలిసి ఇంట్లో నిద్రిస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో ఏదో కుట్టినట్లు గుర్తించింది.వెంటనే కుటుంబ సభ్యులు పరిశీలించగా ఆమె పడుకున్న బట్టల వద్ద “కట్ల పాము” కనిపించడంతో పాము కాటుగా అనుమానించారు.అనంతరం 108 అంబులెన్స్లో వెంటనే వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే వైద్యుల చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం సుమారు 6:10 గంటలకు ఆమె ఆరోగ్యం విషమించి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.మృతురాలి భర్త మారిపెల్లి అంజయ్య ఇచ్చిన ఫిర్యాదులో,పాము కాటు కారణంగానే తన భార్య మృతి చెందిందని, ఈ ఘటనపై ఎవరి మీదా ఎలాంటి అనుమానం లేదని పేర్కొన్నారు.పోలీసులు కేసు నమోదు చేసి, పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రక్రియ చేపట్టారు.