వాటర్ ప్లాంట్లో నీటి వృథా..పట్టించుకోని అధికారులు
సాగరం గ్రామ పంచాయతీ ఆవరణలో నిలిచిపోయిన నీరు
బురదగా మారిన పరిసరాలు.. ప్రజలకు ఇబ్బందులు
జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలం సాగరం గ్రామ పంచాయతీ పరిధిలోని వాటర్ ప్లాంట్ నుంచి తాగునీరు నిరంతరం వృథాగా పోతున్నప్పటికీ సంబంధిత అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వాటర్ ప్లాంట్ నుంచి లీకవుతున్న నీరు గ్రామ పంచాయతీ ఆవరణలోనే నిలిచిపోవడంతో అక్కడ బురద పేరుకుపోయి అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. దీంతో పంచాయతీ కార్యాలయానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి వృథాతో పాటు దోమల వ్యాప్తి, దుర్వాసన వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సంబంధిత అధికారులు వెంటనే స్పందించి లీకేజీని అరికట్టి, నిల్వ నీటిని తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.