సత్తుపల్లిలో 15 వేల మందితో భారీ వనమహోత్సవ ర్యాలీ
పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం పెంపొందించే లక్ష్యంతో ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సత్తుపల్లి పట్టణంలో శుక్రవారం రాష్ట్రంలోనే తొలిసారిగా సుమారు 15 వేల మందితో భారీ వనమహోత్సవ ర్యాలీ నిర్వహించారు. జేవీఆర్ కళాశాల మైదానంలో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ఖమ్మంజిల్లా కలెక్టర్ దివాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
జేవీఆర్ కళాశాల నుంచి పాత సెంటర్ వరకు సాగిన ర్యాలీలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు చెందిన వేలాది మంది విద్యార్థులు, యువత, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. జానపద కళాకారుల ప్రదర్శనలు ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర్ మాట్లాడుతూ, ఇంత భారీ స్థాయిలో వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ మాట్లాడుతూ సత్తుపల్లి నియోజకవర్గం సామాజిక చైతన్యంలో ముందంజలో ఉందని ఈ వనమహోత్సవ ర్యాలీ రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో: సబ్ కలెక్టర్,డీఎఫ్వో, ఖమ్మంజిల్లా డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ విద్యాసంస్థల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు