ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆధ్వర్యంలో ‘ఆటో అన్నలతో ముఖాముఖి’ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆటో కార్మికులు పూర్తిగా ఆర్థికంగా దెబ్బతిన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని, నెలకు 12 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇంతవరకు ఆ హామీని అమలు చేయలేదని విమర్శించారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఇచ్చిన హామీ కంటే అదనంగా నెలకు 15 వేల రూపాయల ఆర్థిక భృతిని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.మరోవైపు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచుతూ ఆటో కార్మికులను మానసిక క్షోభకు గురిచేస్తోందని మండిపడ్డారు.పెరిగిన ఇంధన ధరల వల్ల ఆటోలు నడపడం కష్టంగా మారిందని, రోజువారీ వచ్చే సంపాదన డీజిల్, గ్యాస్, వాహన మరమ్మతు ఖర్చులకే సరిపోతుండటంతో కుటుంబాలు గడవడం తీవ్ర ఇబ్బందిగా మారిందని ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం ఆటో కార్మికులందరికీ ప్రత్యేకంగా ‘ఆటో అన్న కార్డు’ జారీ చేసి, వారి కుటుంబాలకు పూర్తి ఉచిత విద్య, వైద్య సదుపాయాలు కల్పించాలని అరవింద్ డిమాండ్ చేశారు.ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే,కార్మికులందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ పట్టణ నాయకులు మురళి, శివ, వట్టం ప్రశాంత్,స్థానిక ఆటో కార్మికులు పాల్గొన్నారు