భాగిర్దిపేటలో శ్రీ వెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీస్ ప్రారంభం
రైతులకు గిట్టుబాటు ధర,యువతకు ఉపాధి అవకాశాలు-ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రేగొండ మండలం భాగిర్దిపేట గ్రామంలో ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీస్ను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (జీఎస్సార్) బుధవారం ఉదయం ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే, పరిశ్రమను ప్రారంభించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ,రైతులు పండించిన ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర లభించాలంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి రైస్ మిల్లులు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు మరింతగా అవసరమని అన్నారు. కొత్తగా ప్రారంభమైన ఈ రైస్ ఇండస్ట్రీ ద్వారా స్థానిక రైతులకు ధాన్యం విక్రయానికి సౌకర్యం కలగడమే కాకుండా, రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గి లాభం చేకూరుతుందని పేర్కొన్నారు.అదేవిధంగా, ఈ పరిశ్రమ ద్వారా స్థానిక యువతకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని,గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ఎమ్మెల్యే తెలిపారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి అనుకూల విధానాలు అమలు చేస్తోందని,ఈ అవకాశాలను వినియోగించుకుని స్థానిక పెట్టుబడిదారులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, రైతులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.