పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసా
భూపాలపల్లి నియోజకవర్గంలో 469 మంది లబ్ధిదారులకు రూ.4.69 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఆడబిడ్డల వివాహాలను ఆర్థికంగా ఆదుకోవడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్పష్టం చేశారు.మహిళల సామాజిక, ఆర్థిక భద్రతను కేంద్రీకరించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో నేరుగా మార్పు తీసుకొస్తున్నాయని ఆయన అన్నారు.ఈ రోజు భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని రేగొండ, కొత్తపల్లిగోరి, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్ళపల్లి, గణపురం మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 469 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు రూ.4,69,54,404 విలువైన చెక్కులను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై అందజేశారు.ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమాలు రేగొండ రైతువేదిక, చిట్యాల రైతువేదిక, గణపురం గ్రామపంచాయతీ కార్యాలయ ప్రాంగణాల్లో నిర్వహించగా, పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేద కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహాల సమయంలో తల్లిదండ్రులు ఎదుర్కొనే ఆర్థిక ఒత్తిడిని తగ్గించేందుకే కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని వివరించారు.ఈ పథకాలు కేవలం ఆర్థిక సహాయానికి మాత్రమే పరిమితం కాకుండా,పేదింటి ఆడబిడ్డల భవిష్యత్తుపై ప్రభుత్వానికి ఉన్న బాధ్యతకు నిదర్శనమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారునికి ఎలాంటి వివక్ష లేకుండా సహాయం అందేలా పారదర్శక విధానాలతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల జీవితాల్లో సానుకూల మార్పును తీసుకొస్తున్నాయని, ముఖ్యంగా మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.ప్రజల సంక్షేమమే ప్రభుత్వ పాలనకు మూలసూత్రమని, భవిష్యత్తులో కూడా పేదల సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తామని ఆయన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమాల్లో ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు