పర్వతగిరి కాంగ్రెస్లో విభేదాలు
పర్వతగిరి మండల కాంగ్రెస్ పార్టీలో మండల అధ్యక్ష పదవి మార్పు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.ఈ నేపథ్యంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు.మండల అధ్యక్షుడిగా ఉన్న జాటోత్ శ్రీనివాస్ నాయక్ మార్పు పార్టీకి తీరని లోటు అని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి, గిరిజన తండాలు,గ్రామాల్లో పార్టీ శ్రేణులను ఏకం చేయడంలో ఆయన పోషించిన పాత్రఅసాధారణమైనదని కొనియాడారు.ఆయన సేవలను పార్టీ అధిష్ఠానం గుర్తించాలని, క్యాడర్లో నైరాశ్యం రాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా జాటోత్ శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ, పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసినా,ప్రస్తుతం మండల కేంద్రంలో కొందరి తీరు వల్ల కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు.తన తదుపరి రాజకీయ భవిష్యత్తుపై వారం రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు.సమావేశంలో కొందరు సర్పంచులు మాట్లాడుతూ, మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులు,పంచాయతీ నిధులు, స్థానిక వ్యవహారాల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. రెవెన్యూ, పోలీస్ వ్యవహారాల్లో అనవసర జోక్యం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మెరం తవ్వకాలు, ఇసుక రవాణాపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు.ఈ వ్యాఖ్యలు స్థానిక కాంగ్రెస్ వర్గాల్లో,ముఖ్యంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అనుచరుల్లో చర్చకు దారితీశాయి. శ్రీనివాస్ నాయక్ తీసుకోబోయే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు బొంపల్లి దేవేందర్ రావు,పలువురు సర్పంచులు, మండల కాంగ్రెస్ మైనారిటీ అధ్యక్షురాలు సుల్తానా,సీనియర్ నాయకులు,పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.