ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నూతన సర్పంచ్లు పని చేయాలి
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పెట్టుకొని నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు సమిష్టిగా పని చేయాలని భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు (జీఎస్సార్) పిలుపునిచ్చారు.రేగొండలో నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ పాలక వర్గం పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే జీఎస్సార్,రేగొండ గ్రామ సర్పంచ్గా ఎన్నికైన వారణాశి మౌనిక అజయ్ (అంజి), రేగొండ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎళ్దండి నరేష్ తో పాటు వార్డు సభ్యుల చేత పదవి ప్రమాణ స్వీకారం చేయించారు.అనంతరం నూతన పాలకవర్గ సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ, గ్రామస్థులకు మెరుగైన పాలన అందించాలంటే సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో గ్రామ పంచాయతీలకు అవసరమైన నిధులు నిరంతరంగా అందుతాయని, వాటిని సద్వినియోగం చేసుకుని గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించాలని అన్నారు. ప్రజల సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ పారదర్శక పాలనను అమలు చేయాలని, ప్రజల విశ్వాసాన్ని ఎప్పటికీ నిలబెట్టుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుటోజు కిష్టయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇప్పకాయల నరసయ్య,జిల్లా నాయకుడు గండి తిరుపతి గౌడ్,గ్రామ కమిటీ అధ్యక్షుడు ఏనుగు రవీందర్ రెడ్డి, యువజన నాయకులు తదితరులు పాల్గొని నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.