క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర
భూపాలపల్లి పట్టణంలోని మంజూరునగర్ ప్రాంతంలో ఉన్న కల్వరి చర్చిలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున జిల్లా మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై క్రైస్తవ సోదరసోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు.అనంతరం మాట్లాడుతూ, క్రిస్మస్ పండుగ శాంతి, ప్రేమ, కరుణ, త్యాగం వంటి మానవీయ విలువలకు ప్రతీక అని అన్నారు. ఏసుక్రీస్తు బోధనలు సర్వ మానవాళికి మార్గదర్శకమని, పరస్పర సహకారం, సహనం, సోదరభావంతో జీవించడమే క్రిస్మస్ పండుగ యొక్క అసలైన సందేశమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.సమాజంలో ఐక్యత, సమానత్వం, మానవత్వాన్ని పెంపొందించడంలో క్రిస్మస్ పండుగ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అన్ని మతాలు మానవత్వాన్నే బోధిస్తాయని, ప్రతి ఒక్కరూ పరస్పరం గౌరవంతో జీవించినప్పుడే సమాజం శాంతియుతంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని, క్రైస్తవుల అభివృద్ధికి అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ శాఖ అధికారులు, చర్చి నిర్వాహకులు, క్రైస్తవ సంఘ నాయకులు,విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు.వేడుకలు ఆనందోత్సాహాలతో, భక్తిశ్రద్ధల మధ్య ముగిశాయి