ఖాదిర్ ఖాన్ కుటుంబానికి50 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్
మెదక్ పోలిసుల దెబ్బలకు మృతి చెందిన ఖాదిర్ ఖాన్ ఇంటికి ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ నేతృత్వంలో ఆవాజ్ ప్రతినిధి బృందం వెళ్ళి ఆయన కుటుంబాన్ని పరామర్శించి,
కుటుంబ సభ్యులను ఓదార్చారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఖాదిర్ ఖాన్ కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు ఆవాజ్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ మాట్లాడుతూ…
మెదక్ పోలీసులు ఖాదిర్ ఖాన్ పై చైన్ స్నాచింగ్ కేసి బనాయించి చిత్రహింసలకు గురిచేసి ఖాదిర్ ఖాన్ మరణానికి కారకులయ్యారని, దొంగతనంతో
సంబంధం లేని వ్యక్తిని అరెస్టు చేసి హింసించడం అత్యంత దుర్మార్గమైన విమర్శించారు. ఖాదిర్ ఖాన్ కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, పిల్లల చదువులకు సహకరించి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు..
తాము కొట్టలేదని పోలీసులు అబద్ధాలు చెబుతున్నారని, నేరం ఒప్పించడం కోసం తీవ్రంగా కొట్టడంతో చనిపోయాడని కుటుంబ సభ్యులు చెప్పారని, వీపుమీద కమిలిన దెబ్బలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు. కుటుంబ పెద్దగా ఖాదర్ ఖాన్ మరణంతో భార్య, ముగ్గురు పిల్లలు అనాధలయ్యారని, హైకోర్టు సుమోటోగా కేసు స్వీకరించడం సంతోషకరమైన విషయంమని, తప్పుచేసిన పోలీసులను కఠినంగా శిక్షించాలని, ఖాదిర్ ఖాన్ కుటుంబానికి న్యాయం చేయాలని అన్నారు. ఖాదిర్ ఖాన్ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నారు.
మెదక్ లో ఖాదిర్ ఖాన్ కుటుంబాన్ని పరామర్శించిన ఆవాజ్ ప్రతినిధి బృందంలో ఆవాజ్ సీనియర్ నాయకులు ఎండి సర్దార్, మెదక్ జిల్లా నాయకులు మోహిని, సిఐటియు జిల్లా కార్యదర్శి బసవరాజ్, కోశాధికారి నరసమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మల్లేశం తదితరులు ఉన్నారు.