చేతులపై కలెక్టరేట్ కు వచ్చిన దివ్యాంగుడు

పాఠశాలను తెరిపించాలంటూ గ్రీవెన్స్ వినతి అభినందించిన అధికారులు

ఈ69న్యూస్ వరంగల్ జూన్ 30

వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన దివ్యాంగుడు గుమ్మదిరాజుల వెంకటేశ్వర్లు సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనేందుకు చేతుల సహాయంతో వరంగల్ కలెక్టరేట్‌కు చేరుకున్నారు. గ్రామంలో మూతపడిన ప్రభుత్వ పాఠశాలను తిరిగి ప్రారంభించాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, దాదాపు 40 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ ప్రభుత్వ పాఠశాల వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దిందని, అలాంటి సరస్వతీ నిలయం నేడు మూతపడటం బాధాకరమన్నారు. పాఠశాలకు పక్కా భవనం ఉన్నప్పటికీ విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, గ్రామంలో బడి బాట వంటి కార్యక్రమాలు కూడా నిర్వహించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.పాఠశాల మూతపడటంతో గ్రామానికి చెందిన సుమారు 25 మంది చిన్నారులు ప్రతిరోజూ ఆటోల్లో పక్క గ్రామాలకు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. వెంటనే పాఠశాలను పునఃప్రారంభించి గ్రామ పిల్లలకు స్థానికంగానే విద్య అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.వెంకటేశ్వర్ల పట్టుదల, విద్య పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతను చూసిన జిల్లా అధికారులు ఆయనను అభినందించి, వినతిపత్రాన్ని స్వీకరించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *