ఓపెన్‌కాస్ట్ బ్లాస్టింగ్, డస్ట్ కాలుష్యాన్ని అరికట్టాలిఓపెన్‌కాస్ట్ బ్లాస్టింగ్, డస్ట్ కాలుష్యాన్ని అరికట్టాలి

సత్తుపల్లి సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనుల్లో జరుగుతున్న బ్లాస్టింగ్, దుమ్ము కాలుష్యంతో పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు జాజిరి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సీపీఎం సత్తుపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్‌కు సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా జాజిరి శ్రీనివాస్ మాట్లాడుతూ బొగ్గు వెలికితీత కోసం నిర్వహిస్తున్న భారీ బ్లాస్టింగ్‌ల వల్ల రేజర్ల, కిష్టారం, రాజీవ్‌నగర్, ఎన్‌టీఆర్ కాలనీ, వెంగళరావునగర్, కాకర్లపల్లి, కొత్తూరు గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు. బ్లాస్టింగ్ కారణంగా ఇళ్లలో కంపనలు, గోడలకు పగుళ్లు, పంటలకు నష్టం, గాలిలో దుమ్ము వ్యాపించి ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నారులు, వృద్ధులు, గర్భిణీలు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారని, వైద్య ఖర్చులతో పేద కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.
సత్తుపల్లి ఓపెన్‌కాస్ట్‌లో ఉత్పత్తి అయ్యే ప్రతి టన్ను బొగ్గుపై ఖనిజ నిధి కింద జమయ్యే నిధులను ప్రభావిత గ్రామాల అభివృద్ధికే వినియోగించాలని డిమాండ్ చేశారు. బ్లాస్టింగ్‌ను శాస్త్రీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించడం, గనుల పరిసరాల్లో నిరంతరం నీరు చల్లి దుమ్ము నియంత్రించడం, ప్రభావిత గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించడం, ఇళ్లకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించడం, హరితవనాల అభివృద్ధితో కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే సింగరేణి సంస్థ ఏర్పాటు చేసిన ఆర్‌వో ప్లాంట్లలో పనిచేయని వాటిని వెంటనే మరమ్మతులు చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో: సీపీఎం మండల కమిటీ సభ్యులు కువ్వారపు లక్ష్మణరావు, బండి వేలాద్రి, బెజవాడ లక్ష్మీనారాయణ, తడికమళ్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

About The Author

One thought on “ఓపెన్‌కాస్ట్ బ్లాస్టింగ్, డస్ట్ కాలుష్యాన్ని అరికట్టాలి”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *