Writer and Actress M. Rohini Delivers Opening Address at AIDWA 14th National ConferenceProminent Writer-Actor M. Rohini Speaks on Women’s Rights at AIDWA Meet

ఇండ్ల నుంచే మార్పు ప్రారంభం కావాలి.

మహిళలు సామ్రాజ్యవాడ ప్రమాదాన్ని గమనించాలి.

మానవత్వమే ఎజెండాగా ముందుకు సాగాలి

*దానికి మతం, ప్రాంతం, జాతి భేదాలేవు.

‘ఐద్వా’ 14వ జాతీయ మహాసభల ప్రారంభోపన్యాసంలో ప్రముఖ రచయిత, సినీనటి ఎమ్ రోహిణి

మహిళలు పోరాటాల ద్వారానే సమానత్వాన్ని సాధించగలుగుతారని ప్రముఖ రచయిత, సినీనటి ఎమ్ రోహిణి అన్నారు.

దానికంటే ముందు మన ఇండ్ల నుంచే అభ్యుదయంతో కూడిన సమానత్వం ప్రారంభం కావాలనీ, ఆ మేరకు మార్పును ఆహ్వానించాలని సూచించారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14వ జాతీయ మహాసభలు ఆదివారంనాడిక్కడి ఆర్టీసీ కళ్యాణమండపంలోని మల్లు స్వరాజ్యం ప్రాంగణంలో ప్రారంభమయ్యాయి. కామ్రేడ్ సరోజినీ బాలానందన్ నగర్, కామ్రేడ్ చంద్రకళాపాండే హాల్లో జరిగిన ప్రారంభసభలో రోహిణి ప్రారంభోపన్యాసం చేశారు. యువతరం సామ్రాజ్యవాద ప్రమాదాన్ని గమనించాలనీ, ఆ దిశగా కుటుంబాలను చైతన్యవంతం చేయాల్సిన బాధ్యతను మహిళలే తమ భుజస్కందాలపై వేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. దేశంలో మహిళా హక్కులు కేవలం కాగితాలకే పరిమిత మయ్యాయనీ, వారిపై ఆంక్షలు, వివక్ష ఇంటి నుంచే మొదలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు నిత్యం తమ కుటుంబంతో పాటు సమాజంకోసమూ పోరాటాలు చేయాల్సివస్తుందన్నారు. ఎదురవుతున్న సవాళ్లు, వివక్షను అధిగమిస్తూ ఉన్నతమైన కుటుంబాన్ని సమాజానికి పరిచయం చేసేది మహిళేనని స్పష్టం చేశారు. ‘ఐద్వా’ ఇండ్లలో మౌనసాక్షులుగా గొంతులేని వారిపక్షాన దేశం కోసం, మహిళా హక్కుల కోసం పోరాడుతుందని తెలిపారు. మహిళల హక్కుల్ని ఎవరో నిర్దేశించడం సరికాదనీ, మహిళలే వాటిని నిర్ధారించుకోవాలని సూచించారు. స్వాతంత్ర్యోద్యమంలో మహిళల పాత్ర చాలా గొప్పదనీ, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలోనూ మహిళలు అగ్రభాగాన నిలిచారని వివరించారు. మహిళలు ఇంట్లో వండి పెడితేనే భవిష్యత్ తరం మనుగడ సాగిస్తున్నదనే వాస్తవాన్ని గమనించాలని చెప్పారు. యువతరం సామ్రాజ్యవాద ప్రమాదాన్ని గమనించాలనీ, సమానత్వం కోసం పోరాటం కొనసాగుతూనే ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఇండ్లలో మన పిల్లలకు మనమే హీరోలుగా గుర్తిండిపోవాలని కాంక్షించారు. మహిళల స్వాతంత్ర్యం, సమానత్వంపై జరుగుతున్న అబద్ధ ప్రచారాలను అర్ధం చేసుకోవాలనీ, అందరికీ సమన్యాయం లభించాలని చెప్పారు. ప్రస్తుతం దేశంలో రాజ్యాంగ పీఠిక సవాళ్లను ఎదుర్కొంటున్నదనీ, దానిలోని సమానత్వానికి విఘాతం కలుగుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. పురుషులతో సమానంగా మహిళలకు హక్కులు లేవనీ, ఇప్పటికీ ఆర్ధికంగా కుటుంబాలపైనే ఆధారపడుతూ, మహిళలు తమ అవసరాలను అణచివేసుకుంటున్నారని వివరించారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలనీ, ఇండ్లనుంచే ఆ మార్పు కోసం చైతన్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. సమాజంలో మార్చుకోసం మహిళలు తాము చేస్తున్న పనుల్నే ఆయుధాలుగా మార్చుకోవాలని సూచించారు. కళలతో పాటు చదవడం, రాయడం, చేస్తున్న వృత్తులు, ఆలోచనల్ని ఆయుధాలుగా మలుచుకుంటే, పాలకులు తలవంచక తప్పదనీ, తద్వారా సమాన అవకాశాలు సాధించుకోవడం సులభమవుతుందని తెలిపారు. చేతులెత్తి ఆకాశంవైపు చూస్తూ ఈ పూటకు తిండి పెట్టమని ప్రార్ధించడం వల్ల సమాజంలో మార్పు రాదని స్పష్టం చేశారు. పోరాడితేనే సామాజిక మార్పు సాధ్యమౌతుందనీ, దీనికి భాష, ప్రాంతం, జాతి, మతంతో సంబంధం లేదని స్పష్టంచేశారు. మనిషి మానవత్వం అనేవే అజెండాగా ఉ ండాలనీ, దానికోసం ప్రతిఒక్కరూ మరొకరి కోసం ఆలోచించాలని చెప్పారు. అభ్యుదయ మనస్తత్వాలే మార్చును సాధించగలుగుతాయనీ, కట్నం తీసుకోం- ఇవ్వబోం అనే నినాదం మన ఇండ్ల నుంచే ప్రారంభం కావాలన్నారు. దానికోసం

మహిళలే నడుం బిగించాలనీ, భవిష్యత్ తరాలు ఈ స్పూర్తిని అందిపుచ్చుకోవాలని దిశానిర్దేశం చేశారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *