సిపిఎం జిల్లా కార్యదర్శి కనకయ్య..
ఎవరు అధికారంలో ఉన్న ప్రజల పక్షాన పోరాడుతాం
గోదావరి ముంపు నుండి శాశ్వత పరిష్కారం చూపించాలి.
సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు.
ఘనంగా అమరజీవి కామ్రేడ్ బండారు చందర్రావు 38వ వర్ధంతి సభ
గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా ప్రజా సమస్యలపై సమరశీల పోరాటాలు నిర్వహించడమే అమరజీవి కామ్రేడ్ బండారు చందర్రావుకు మనం ఇచ్చే ఘన నివాళి అని సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. భద్రాచలం డివిజన్ ఉద్యమ నిర్మాతల్లో ఒకరు అమరజీవి కామ్రేడ్ బండారు చందర్రావు గారి 38వ వర్ధంతి సభ పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన జరిగింది. ముందుగా బండారు చందర్రావు గారి స్తూపం వద్ద జెండాను పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య ఆవిష్కరించారు. చందర్ రావు గారి చిత్రపటానికి పార్టీ సీనియర్ నాయకులు యలమంచి రవికుమార్, జిఎస్ శంకర్రావు, బి బి జి తిలక్, ఎం.వి.ఎస్ నారాయణ లు పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాచలం డివిజన్ లో ఆదివాసీలు, ఇతర శ్రామిక ప్రజల హక్కుల కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన ధన్యజీవి కామ్రేడ్ బండారు చందర్రావు అని అన్నారు. భద్రాచలం నియోజకవర్గం లో 8సార్లు సిపిఎం గెలుపొందిందని సిపిఎం ప్రజాప్రతినిధులు కృషి ఫలితంగానే మారుమూల గ్రామాలు సైతం అభివృద్ధికి నోచుకున్నాయని అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సిపిఎం ఓడీన, ఓటింగ్ శాతం తగ్గిన కృంగిపోయేది లేదని ప్రజా సమస్యలపై నిర్మాణాత్మకంగా పోరాటం నిర్వహించడం ద్వారానే ఎర్రజెండాను ముందుకు తీసుకుపోవాలని ఆయన అన్నారు.
సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, ఏజే రమేష్ లు మాట్లాడుతూ అధికారంలో ఎవరు ఉన్న ప్రజా సమస్యలపై ప్రజల పక్షాన పోరాడుతామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన జిల్లా మంత్రులు భద్రాచలం వచ్చిన సందర్భంలో భద్రాచలం ప్రజల ఆకాంక్షకు అనుకూలంగా మాట్లాడకపోవటం ఇబ్బంది కలిగిందని, అయినా ఎన్నికల సమయంలో వివిధ సభలలో వారు వాగ్దానం చేసిన హామీలను అమలు చేయాలని, ప్రధానంగా గోదావరి ముంపు నుండి భద్రాచలం పట్టణం రక్షణకు శాశ్వత పరిష్కారం చూపించాలని ఆయన అన్నారు. రామాలయం అభివృద్ధి భద్రాచలం పట్టణ అభివృద్ధికి నేడు ఎన్నికైన ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో సాగు నీరు త్రాగునీరు సమస్యలు పరిష్కారానికి ప్రయత్నించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.బి.నర్సారెడ్డి, కే బ్రహ్మచారి జిల్లా కమిటీ సభ్యులు ఎం రేణుక, సున్నం గంగా పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బి. వెంకటరెడ్డి బండారు శరత్ బాబు, నాదెళ్ల లీలావతి, పట్టణ కమిటీ సభ్యులు డి సీతాలక్ష్మి, కుంజా శ్రీనివాస్, చుక్కా మాధవరావు, తదితరులు పాల్గొన్నారు..
