వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన అదనపు కలెక్టర్ అశోక్ కుమార్
మే 2 వరకు మహిళా,బాలల సంరక్షణపై విస్తృత అవగాహన
షెడ్యూల్ విడుదల చేసిన జిల్లా యంత్రాంగం
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి
జిల్లాలో బాలల సంరక్షణ, మహిళా శ్రేయస్సు,యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచడమే లక్ష్యంగా ఏప్రిల్ 27 నుండి మే 2 వరకు ‘జిల్లా స్థాయి కార్యాచరణ’ను అమలు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ ప్రకటించారు.సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘చిల్డ్రన్స్ వీక్’ వాల్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. బాల్య వివాహాలు, పోక్సో చట్టం, బాలకార్మిక వ్యవస్థపై ప్రజల్లో చైతన్యం తేవడమే ఈ వారం రోజుల కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు.వారం రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి:
ఏప్రిల్ 28 మండల స్థాయిలో టీనేజ్ గర్భధారణలు, బాలికలు ఇంటి నుండి పారిపోయే కేసులపై అవగాహన మరియు కౌన్సెలింగ్.
ఏప్రిల్ 29 ఐడీఓసీలో విద్యార్థులు, తల్లిదండ్రులకు ‘సైబర్ భద్రత – సురక్షిత ఇంటర్నెట్’పై అవగాహన.
ఏప్రిల్ 30 అనాథలు, సంరక్షణ అవసరమున్న పిల్లల గుర్తింపు కోసం మండల స్థాయిలో సర్వే.
మే 01 ఐడీఓసీలో దత్తత మరియు ఫోస్టర్ కేర్ పై అవగాహన,హెల్ప్ డెస్క్ ఏర్పాటు.
మే 02 జిల్లా కేంద్రంలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన ర్యాలీ మరియు విద్యార్థులతో ప్రతిజ్ఞ.
వివిధ శాఖలు సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. జిల్లా ప్రజలు, యువత ఈ అవగాహన సదస్సుల్లో పాల్గొని బాలల రక్షణకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఏఎస్పీ నరేష్ కుమార్, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి మల్లేశ్వరి, డీఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్, డీఈఓ రాజేందర్, ఆర్డీఓ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
