జిల్లా కలెక్టర్ తో సమావేశమైన వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య
వరంగల్ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వ నిధుల వినియోగం, ప్రత్యేక ప్రాజెక్టల పురోగతిపై కలెక్టరేట్ లో శుక్రవారం జిల్లా కలెక్టర్ సత్య శారద గారితో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్రం నుంచి మంజూరైన పలు స్కీములు, ప్రజాప్రయోజన పనులపై వివరాలు తెలుసుకున్నారు.
ఈ సమావేశంలో ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ, వరంగల్ జిల్లా అభివృద్ధి వేగం మరింత పెంచడానికి కేంద్ర నిధులను సమర్థవంతంగా వినియోగించాలన్నారు. పెండింగ్లో ఉన్న ఫైళ్ళను వెంటనే క్లియర్ చేసి ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరించాలన్నారు. జిల్లాలో రహదారులు, నీటి పారుదల, విద్య, ఆరోగ్య విభాగాల్లో ప్రాధాన్యత ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నుండి అదనపు నిధులు కేటాయించేలా ప్రయత్నాలు చేస్తానని ఎంపీ డా. కడియం కావ్య తెలిపారు. వరంగల్ అభివృద్ధి విషయంలో వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తన గళాన్ని వినిపిస్తానని ఎంపీ స్పష్టం చేశారు. జిల్లా ప్రజలు ఆశిస్తున్న అభివృద్ధి దిశగా కృషి చేస్తానని ఎంపీ పేర్కొంటూ, వరంగల్ను జాతీయ స్థాయిలో ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యం అని తెలిపారు.