
ఈ69న్యూస్ న్యూస్ భద్రాచలం మార్చి 13:
భద్రాచలం ఐటీడీఏ పరిధిలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, వసతి గృహాలు, బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి గిరిజన విద్యార్థులు ఎటువంటి భయాందోళనలు లేకుండా ధైర్యంగా పబ్లిక్ పరీక్షలు రాయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ తెలిపారు.శనివారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల సందర్భంగా ఆయన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.పరీక్షలు ప్రతి విద్యార్థి జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా ఉంటాయని, విద్యార్థులు ఏకాగ్రతతో చదివి ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాస్తే తప్పకుండా విజయాన్ని సాధిస్తారని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. పరీక్షలకు సంబంధించి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలు 56, వసతి గృహాలు 21, గురుకులాలు 12, బెస్ట్ అవైలబుల్ పాఠశాలలు 3 కలిపి మొత్తం 92 విద్యాసంస్థల్లో 3,628 మంది గిరిజన విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు. వీరిలో 1,689 మంది బాలురు, 1,939 మంది బాలికలు ఉన్నారు.విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేర్చేందుకు ప్రధానోపాధ్యాయులు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అలాగే పరీక్షా కేంద్రాల్లో వైద్య సిబ్బంది, త్రాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ సౌకర్యాలు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని సూచించారు.ఎలాంటి మాల్ ప్రాక్టీస్కు తావు లేకుండా పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని, విద్యార్థులందరూ ప్రశాంతంగా పరీక్షలు రాసి నూరు శాతం ఫలితాలు సాధించి భద్రాచలం ఐటీడీఏకు మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే పరీక్షలు రాస్తున్న గిరిజన విద్యార్థులందరికీ ఆయన మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు.