చిల్పూర్ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి మాటలకే పరిమితం
సీపీఎం మండల కార్యదర్శి సాదం రమేష్ విమర్శ

ఈ69న్యూస్ చిల్పూర్ ఆగస్టు 29
జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గుట్ట శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి గత నాలుగేళ్లుగా మాటలకే పరిమితమైందని సీపీఎం మండల కార్యదర్శి సాదం రమేష్ విమర్శించారు. ఆలయ అభివృద్ధికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో భక్తులకు కనీస వసతులు కూడా అందుబాటులో లేవని ఆయన ఆరోపించారు.
ఆలయానికి వచ్చే భక్తులకు సరైన మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నివాస ప్రాంతాల్లో పారిశుద్ధ్య లోపం, కోతుల బెడద కూడా భక్తులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఆదివారాల్లో కూరగాయల దుకాణాలు, ప్రత్యేక షెడ్లు, సంత కారణంగా ఆలయ పరిసరాల్లో అపరిశుభ్రతతో పాటు ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని అన్నారు.
డబుల్ రోడ్డు హామీ ఏమైంది?

వెంకటేశ్వర్లపల్లి నుంచి చిల్పూర్, వెంకటాద్రిపేట మీదుగా దేవస్థానం వరకు డబుల్ రోడ్డు నిర్మిస్తామని గత నాలుగేళ్లుగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, ప్రస్తుత ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు హామీలు ఇస్తున్నారని సాదం రమేష్ తెలిపారు. అయితే ఇప్పటి వరకు శంకుస్థాపన కూడా జరగలేదని, కనీసం తట్టెడు మట్టి కూడా తీయలేదని విమర్శించారు.
దేవస్థానానికి కోట్లాది రూపాయల ఆదాయం వస్తోందని సమావేశాలు, పత్రికల ద్వారా చెబుతున్నప్పటికీ, అభివృద్ధి పనులు మాత్రం కనిపించడం లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రగల్భాలు మాని ఆలయం, పరిసర ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేసి భక్తులకు కనీస వసతులు కల్పించాలని సీపీఎం పార్టీ తరఫున డిమాండ్ చేశారు.