ఆదివాసీ బిడ్డ శిరీషను పొట్టన పెట్టుకున్న దుర్మార్గుడికి ఉరిశిక్ష వేయాలి…

- శిరీష హత్యపై ప్రభుత్వం మౌనం వీడాలి.. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి
- పల్లె నుంచి పట్నానికి వెళ్లిన ఆదివాసీ బిడ్డకు ఇదేనా భద్రత? శిరీష కుటుంబానికి తక్షణ న్యాయం చేయాలి
- శిరీష కుటుంబానికి రూ.కోటి పరిహారం.. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి
- ఆదివాసీ యువతి ప్రాణం తీసిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలి.. ఆసుపత్రి యాజమాన్య నిర్లక్ష్యాన్ని తేల్చాలి
- శిరీషకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు.. ప్రభుత్వం వెంటనే స్పందించాలి
-తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి & ములుగు జిల్లా ఎస్సి, ఎస్టి అట్రాసిటీ విజులెన్స్ & మానిటరింగ్ కమిటి మెంబర్ చింత కృష్ణ డిమాండ్
తెలుగు గళం గోవిందరావుపేట, ములుగు ఆగస్టు 31:
పొట్టకూటి కోసం పల్లె నుంచి పట్నానికి వెళ్లి ప్రైవేట్ ఆసుపత్రిలో చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న అమాయక ఆదివాసీ యువతి ఉయిక శిరీషపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన తీవ్రంగా కలచివేసిందని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి చింత కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శిరీష కుటుంబానికి తక్షణ న్యాయం చేయడంతో పాటు నిందితుడిపై అత్యంత కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డ్యూటీ అనంతరం గదిలో విశ్రాంతి తీసుకుంటున్న శిరీషపై అర్ధరాత్రి సమయంలో దాడి చేసి అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన అత్యంత దారుణమని అన్నారు. మహిళలు, ముఖ్యంగా గ్రామీణ మరియు ఆదివాసీ ప్రాంతాల నుంచి ఉపాధి కోసం పట్టణాలకు వెళ్తున్న యువతుల భద్రతపై ఈ ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ ఘటనకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న షానా ఉల్లా ఖాన్పై కేసును అత్యంత వేగంగా దర్యాప్తు చేసి, ఎలాంటి రాజకీయ లేదా ఇతర ఒత్తిళ్లకు తావులేకుండా కఠినంగా శిక్షపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితుడినకి ఉరి శిక్ష వేయాలని తుడుం దెబ్బ తరఫున డిమాండ్ చేస్తున్నామని, అదే సమయంలో బాధితురాలికి న్యాయం జరిగేలా చట్టపరమైన ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. శిరీష కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయిందని, వారి పరిస్థితిని ప్రభుత్వం మానవతా దృక్పథంతో పరిగణించాలని చింత కృష్ణ అన్నారు. శిరీష కుటుంబానికి రూ.1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించడంతో పాటు కుటుంబంలో ఒకరికి తక్షణమే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి కేవలం పరామర్శలు, హామీలు కాకుండా ఆర్థిక భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని చింత కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
