నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి

గ్రామాల్లో మౌలిక వసతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన పేదలను గుర్తించాలి: సీపీఎం
తెలుగు గళం ఏటూరునాగారం, ఆగస్టు 31:
ఏటూరునాగారం మండలంలోని సొంత ఇల్లు లేని పేద, నిరుపేద కుటుంబాలను సమగ్రంగా గుర్తించి అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని సీపీఎం ఏటూరునాగారం మండల కార్యదర్శి వర్గ సభ్యులు తోలెం కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తోలెం కృష్ణయ్య మాట్లాడుతూ.. ఏటూరునాగారం మండలంలోని అనేక పేద కుటుంబాలు సొంత ఇళ్లు లేక అద్దె ఇళ్లు, గుడిసెలు, శిథిలావస్థకు చేరిన ఇళ్లలో నివసిస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నిజమైన నిరుపేదలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా సర్వే చేసి గుర్తించి, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ జోక్యానికి తావులేకుండా పూర్తి పారదర్శకత పాటించాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామాల్లో వాస్తవ పరిస్థితులను పరిశీలించి అత్యంత పేదలకు, ఇల్లు లేని కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అదేవిధంగా మండలంలోని పలు గ్రామాల్లో మౌలిక వసతులు సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కృష్ణయ్య పేర్కొన్నారు. సరైన డ్రైనేజీ, సైడ్ కాలువలు లేక మురుగునీరు రోడ్లపై నిలిచిపోతుందని, దీంతో దోమలు పెరిగి ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. అవసరమైన ప్రాంతాల్లో వెంటనే డ్రైనేజీ, సైడ్ కాలువల నిర్మాణం చేపట్టాలని కోరారు. గ్రామాల్లో ప్రధాన రహదారులతో పాటు అంతర్గత వీధుల్లో కూడా వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, పనిచేయని దీపాలను వెంటనే మరమ్మతు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో మహిళలు, వృద్ధులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వీధి దీపాల సమస్యను పరిష్కరించాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి క్రమం తప్పకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, చెత్తను సకాలంలో తొలగించాలని కోరారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైన ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడంతో పాటు మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. మండల అధికారులు గ్రామపంచాయతీలతో సమన్వయం చేసుకుని క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి తక్షణమే పరిష్కరించాలని తోలెం కృష్ణయ్య డిమాండ్ చేశారు. నిరుపేదలకు సొంత ఇంటి కలను సాకారం చేయడంతో పాటు గ్రామాల్లో కనీస మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు కోరం చిరంజీవి, విజయ్ కుమార్, చాట్ల సమ్మక్క, తాటి సుజాత, హనుమయ్య, కాపుల శీను, చాట్ల విజయకుమార్, తల్లడి శకుంతల, తాటి రమాదేవి, స్వామి తదితరులు పాల్గొన్నారు.
