మున్సిపల్ ఎన్నికల్లో కమ్యూనిస్టులను ఆదరించండి
ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతూ ప్రజల పక్షాన నిలిచే కమ్యూనిస్టులను రాబోయే జనవరి మున్సిపల్ ఎన్నికల్లో ఆదరించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) జిల్లా కార్యవర్గ సభ్యులు మోటపలుకుల రమేష్ ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రావి నారాయణరెడ్డి భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ, ఇటీవల గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రభుత్వం నిర్వహించిందని,అదే తరహాలో జనవరిలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. భూపాలపల్లి మున్సిపాలిటీలో ఉన్న మొత్తం 30 వార్డుల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలతో ఎలాంటి పొత్తులు లేకుండా సిపిఐ ఒంటరిగా పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ప్రజాసేవ, అభివృద్ధే లక్ష్యంగా కమ్యూనిస్టు పార్టీ ముందుకు సాగుతుందని అన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావం పెరిగిందని విమర్శించిన రమేష్, ఓట్లను కొనుగోలు చేయడానికి లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రజాభివృద్ధికి వినియోగించాల్సిన నిధులను వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు.డబ్బుకు ఓటును అమ్ముకునే రాజకీయ సంస్కృతికి ప్రజలు చెక్ పెట్టాలని, డబ్బులు అవసరం లేని రాజకీయ వ్యవస్థ రావాల్సిన అవసరం ఉందని అన్నారు.కోల్బెల్ట్ ప్రాంతంలో సింగరేణి కార్మికులు ఐక్యంగా ఉండి ప్రజాపక్ష విధానాలకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.నిజమైన ప్రజాసేవ చేస్తూ అభివృద్ధి కోసం పోరాడే వారికే ప్రజలు అండగా నిలవాలని, నిత్యం ప్రజల తరఫున పోరాడే కమ్యూనిస్టులను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలని రమేష్ విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సుధాకర్ రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా సమితి సభ్యులు మాతంగి రామచందర్, సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్, జిల్లా సమితి సభ్యులు క్యాథరాజు సతీష్, నేరెళ్ల జోసెఫ్, వేముల శ్రీకాంత్తో పాటు సిపిఐ, ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు.