మృత్యువు పాశంగా మల్లన్నగండి రిజర్వాయర్.. ఒకే నెలలో ఇద్దరి మృతి
ఈత కొట్టేందుకు సాహసించి ఇద్దరు మృత్యువాత.. భద్రతా ఏర్పాట్లలో అధికారుల వైఫల్యం

ప్రజల ప్రాణాలతో చెలగాటం.. వైరల్గా మారుతున్న ప్రమాదకర దృశ్యాలు
రోజురోజుకూ పెరుగుతున్న పర్యాటకుల తాకిడి.. కనీస వసతులు కరువు
మల్లన్నగండిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రజల డిమాండ్
ఈ69న్యూస్ వరంగల్ /స్టేషన్ ఘనపూర్ ఆగస్టు 29
ప్రకృతి అందాలతో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న మల్లన్నగండి రిజర్వాయర్ ప్రస్తుతం ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం తాటికొండ, జిట్టగూడెం, చిల్పూర్ మండలం గార్లగడ్డ తండా శివారులోని మల్లన్నగండి రిజర్వాయర్ ప్రాంతానికి రోజురోజుకూ పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. అయితే సందర్శకుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వారి భద్రతకు అవసరమైన ఏర్పాట్లు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఈత కొట్టేందుకు సాహసించి ఇద్దరు మృత్యువాత
మల్లన్నగండి రిజర్వాయర్లో ఈత కొట్టేందుకు సాహసించిన ఇద్దరు వ్యక్తులు ఒకే నెలలో మృత్యువాత పడటం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.రిజర్వాయర్లోని నీటి లోతు, ప్రవాహ పరిస్థితులపై అవగాహన లేకుండా ఈతకు దిగడం ప్రమాదకరంగా మారుతోంది. ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ అధికారులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైరల్గా మారుతున్న ప్రమాదకర దృశ్యాలు

రిజర్వాయర్ పరిసరాల్లో కొందరు పర్యాటకులు ప్రమాదకర ప్రాంతాల్లో సాహసాలు చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారుతున్నాయి. ఈత కొట్టడం, ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లడం, సెల్ఫీలు, వీడియోల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సాహసాలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది.ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలని, ఈతకు దిగకుండా కఠినమైన నియంత్రణలు విధించాలని ప్రజలు కోరుతున్నారు.
రోజురోజుకూ పెరుగుతున్న పర్యాటకుల తాకిడి
మల్లన్నగండి రిజర్వాయర్ ప్రకృతి అందాలు, జలకళతో ఆకట్టుకుంటుండటంతో వారాంతాల్లోనే కాకుండా ఇతర రోజుల్లోనూ సందర్శకుల సంఖ్య పెరుగుతోంది.పర్యాటకుల సంఖ్యకు అనుగుణంగా మాత్రం కనీస వసతులు అందుబాటులో లేకపోవడంతో సందర్శకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు చెబుతున్నారు.తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్ సౌకర్యం, హెచ్చరిక బోర్డులు, రక్షణ సిబ్బంది వంటి కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని ప్రజలు పేర్కొంటున్నారు.
పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి
మల్లన్నగండి రిజర్వాయర్ను ప్రణాళికాబద్ధంగా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ ప్రమాదకర ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆపి, మరో ప్రాణం పోకుండా అధికారులు తక్షణమే స్పందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మల్లన్నగండి అందాలను ఆస్వాదించేందుకు వచ్చే పర్యాటకులకు భద్రత కల్పించడంతో పాటు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేసి, ఈ ప్రాంతాన్ని సురక్షిత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరుతున్నారు.