అక్రమాలకు అడ్డుకట్ట ఎప్పుడు..?
ప్రభుత్వం ఉన్నది ఎందుకు..?
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వం అంటే ప్రజల కోసం పనిచేసే పాలనా వ్యవస్థ. ప్రజల ప్రాణాలు, ఆస్తులు, గౌరవం, హక్కులను కాపాడటం ప్రభుత్వ ప్రధాన బాధ్యత.శాంతిభద్రతలను పరిరక్షించడం, అక్రమాలను అరికట్టడం, అవినీతిని నిర్మూలించడం, నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవడం పాలకుల కర్తవ్యం. కానీ నేడు పరిస్థితులు చూస్తుంటే ప్రభుత్వం తన బాధ్యతలను ఎంతవరకు సమర్థవంతంగా నిర్వర్తిస్తోంది అన్న ప్రశ్న ప్రజల్లో తలెత్తుతోంది.రోజూ ఏదో ఒక ప్రాంతంలో మట్టి దందాలు, ఇసుక అక్రమ రవాణా, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, లంచాలు, అవినీతి, మోసాలు, దోపిడీలు, దొంగతనాలు వంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.మరోవైపు మహిళలపై వేధింపులు, అత్యాచారాలు, మానభంగాలు వంటి దారుణాలు సమాజాన్ని కలవరపెడుతున్నాయి.ఒక ఘటన మరువకముందే మరో ఘటన వెలుగులోకి రావడం ప్రజల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.ఒక నేరం జరిగిన తర్వాత కేసు నమోదు చేయడం, కొందరిని అరెస్టు చేయడం, విచారణకు ఆదేశించడం మాత్రమే ప్రభుత్వ బాధ్యతగా భావించరాదు. నేరాలు జరగకుండా ముందుగానే నిరోధించే వ్యవస్థను బలోపేతం చేయాలి.అక్రమాలకు పాల్పడుతున్న వారి వెనుక ఎవరున్నారు? వారికి సహకరిస్తున్న వారు ఎవరు? అధికారుల నిర్లక్ష్యం ఉందా? రాజకీయ అండదండలు ఉన్నాయా? అనే అంశాలపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలి. చిన్నచిన్న వారిపై చర్యలు తీసుకుని, పెద్ద అక్రమార్కులను వదిలేస్తే అక్రమాలకు ఎప్పటికీ అడ్డుకట్ట పడదు.ఇసుక, మట్టి వంటి సహజ వనరులు కొందరి దోపిడీకి గురవుతుంటే ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతుంది. ప్రజా సంపదను దోచుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవినీతి, లంచగొండితనం కూడా ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి. ఒక సాధారణ వ్యక్తి తన న్యాయమైన పని కోసం కూడా కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తే పాలనా వ్యవస్థపై నమ్మకం ఎలా నిలుస్తుంది? మహిళల భద్రత విషయంలో మరింత అప్రమత్తత అవసరం.నేరం జరిగిన తర్వాత స్పందించడం కంటే, నేరాలకు అవకాశం లేకుండా పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడం ముఖ్యం. పోలీసింగ్ను బలోపేతం చేయడంతో పాటు, కేసుల దర్యాప్తు వేగంగా పూర్తి చేసి, నేరస్తులకు చట్టప్రకారం శిక్ష పడేలా చూడాలి. శిక్ష తప్పదనే భయం నేరస్తుల్లో ఏర్పడినప్పుడే నేరాల నియంత్రణ సాధ్యమవుతుంది.ప్రభుత్వం అంటే కేవలం పథకాలు ప్రకటించడం, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం, ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం మాత్రమే కాదు. ప్రజలకు సురక్షితమైన సమాజాన్ని అందించడం కూడా అంతే ముఖ్యమైన బాధ్యత. పాలకులు అంటే అధికారాన్ని అనుభవించడానికి కాదు.. ప్రజలకు జవాబుదారీతనంతో సేవ చేయడానికి.అక్రమాలు జరుగుతుంటే వాటిని అరికట్టాల్సింది ఎవరు? అవినీతి పెరుగుతుంటే దాన్ని నిర్మూలించాల్సింది ఎవరు? ప్రజా సంపద దోపిడీకి గురవుతుంటే కాపాడాల్సింది ఎవరు? మహిళలు, సామాన్య ప్రజలు భయభ్రాంతులకు గురవుతుంటే భరోసా కల్పించాల్సింది ఎవరు?ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అక్రమాలు జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే, అవి జరగకుండా శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయాలి. చట్టాలు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలవాలి.అక్రమార్కులు ఎంతటి వారైనా చట్టం ముందు నిలబడాల్సిందే అన్న నమ్మకం ప్రజల్లో కలగాలి.ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసం..పాలకులు ఉన్నది ప్రజాసేవ కోసం. ఆ బాధ్యతను విస్మరిస్తే ప్రజల ప్రశ్న ఒక్కటే-అక్రమాలు కొనసాగుతుంటే ప్రభుత్వం ఉన్నది ఎందుకు? పాలకులు ఉన్నది ఎందుకు?
ఇప్పుడు కావాల్సింది ప్రకటనలు కాదు..కఠిన చర్యలు. తాత్కాలిక స్పందన కాదు.. శాశ్వత పరిష్కారం.