భూపాలపల్లి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్

తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి
జిల్లాలో పోలీసు సేవలను మరింత మెరుగుపర్చే దిశగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ (ఐపీఎస్) బుధవారం జిల్లా కేంద్రంలోని భూపాలపల్లి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా స్టేషన్లోని వివిధ రికార్డులను, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతిని, సీసీ కెమెరాల పనితీరును,స్టేషన్ పరిసరాల పరిశుభ్రతను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు.వివిధ కేసుల దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. జిల్లాలో నేరాల నియంత్రణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని, ప్రజలకు జవాబుదారీగా ఉంటూ నాణ్యమైన పోలీసు సేవలను అందించేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని పోలీస్ అధికారులకు, సిబ్బందికి స్పష్టం చేశారు
