కొడవటంచ ఆలయంలో వరుణ యాగం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో సోమవారం వరుణ యాగాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు,ఆయన సతీమణి గండ్ర పద్మ దంపతులు హాజరై పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే దంపతులకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి,ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో కొనసాగిన వరుణ యాగంలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొని పూర్ణాహుతి సమర్పించారు.రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని,సమృద్ధిగా వర్షాలు కురవాలని,రైతులు సాగు చేసిన పంటలు పుష్కలంగా పండాలని వారు ప్రత్యేకంగా ప్రార్థించారు.అలాగే చెరువులు,కుంటలు,జలాశయాలు నీటితో నిండాలని,రాష్ట్రంలో ఎలాంటి కరువు పరిస్థితులు తలెత్తకుండా ప్రకృతి అనుకూలంగా ఉండాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో వ్యవసాయ రంగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు.రైతులు ఎంతో శ్రమించి సాగు చేస్తున్న పంటలకు సరిపడా వర్షాలు,అనుకూల వాతావరణ పరిస్థితులు లభించాలని కోరుకుంటూ వరుణ యాగంలో పాల్గొన్నట్లు తెలిపారు.రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండడంతో పాటు చెరువులు,కుంటలు,ప్రాజెక్టులు నిండాలని భగవంతుడిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.ప్రకృతి అనుకూలిస్తే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ఎమ్మెల్యే అన్నారు.రైతుల ముఖాల్లో చిరునవ్వులు చూడటమే తమ లక్ష్యమని,ప్రతి రైతు కుటుంబం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.పంటలకు అవసరమైన నీరు సమృద్ధిగా అందాలని,ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నాయినేని సంపత్రావు,ఆలయ కమిటీ సభ్యులు,ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,భక్తులు,గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఆలయంలో ప్రత్యేక పూజలు,యాగ కార్యక్రమాలు భక్తిశ్రద్ధల మధ్య కొనసాగాయి.
