మద్యం మత్తులో ఘర్షణ.. వ్యక్తి దారుణ హత్య

వరంగల్ క్రైమ్, ఈ69న్యూస్:
మద్యం సేవించిన అనంతరం జరిగిన ఘర్షణ ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొంది. కాజీపేట మండలం రాంపూర్ ఊర చెరువు వద్ద చిల్పూర్ గ్రామానికి చెందిన వెంకటయ్య (45) దారుణ హత్యకు గురయ్యాడు.
సమాచారం ప్రకారం.. వెంకటయ్య మరో వ్యక్తితో కలిసి చెరువు వద్ద మద్యం సేవించాడు. అనంతరం అర్ధరాత్రి సమయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ వ్యక్తి కత్తితో వెంకటయ్యపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
ఘటనపై సమాచారం అందుకున్న ధర్మసాగర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మద్యం సేవించిన సమయంలో ఏం జరిగింది? ఘర్షణకు అసలు కారణమేంటి? హత్యకు పాల్పడిన వ్యక్తి ఎవరు? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. నిందితుడి వివరాలు, హత్యకు దారితీసిన పూర్తి కారణాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.