తమ తండాలోనే పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలని, లేనట్లయితే రానున్న పార్లమెంటు ఎన్నికలలో ఓటు వేయబోమని మండలంలోని చింతలగడ్డ తండా గిరిజనులు నిరసన కార్యక్రమం నిర్వహించారు.శుక్రవారం మండలంలోని చింతలగడ్డ తండా గ్రామపంచాయతీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ, అనేక ఎన్నికలలో చింతలగడ్డ తండాకు చెందిన ఓటర్లు తండాలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లోనే ఓటు హక్కు వినియోగించుకునే వారిమని తెలిపారు. తాజాగా నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చింతలగడ్డ తండాకు చెందిన సుమారు 400 మంది ఓటర్లు స్థానికంగానే ఏర్పాటుచేసిన 204 వ పోలింగ్ బూత్ లోనే ఓటు వేశామని తెలిపారు. కానీ,రాబోవు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా అధికారులు పోలింగ్ బూత్ ను తమ తండా నుండి 5 కిలోమీటర్ల దూరంలో గల రూప్ సింగ్ తండాకు తరలించారని వాపోయారు. చింతలగడ్డ తండాలోనే పోలింగ్ బూత్ ఏర్పాటుకు అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు తమ తండాలోని పోలింగ్ బూత్ ను, తమకంటే తక్కువ ఓటర్లు గల రూప్ సింగ్ తండాకు తరలించడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు.తండాలోని సుమారు నాలుగు వందల మంది ఓటర్లు మండే ఎండలలో వేరే గ్రామానికి వెళ్లి ఓటు వేయడం ఇబ్బందికరమని ఆవేదన వ్యక్తం చేశారు.అధికారులు స్పందించి తమ తండాలోని పోలింగ్ బూత్ ను పునరుద్ధరించి , గతంలో లాగానే స్థానికంగానే ఓటు హక్కును వినియోగించుకునేలా అవకాశం కల్పించాలని కోరారు.లేనట్లయితే పార్లమెంటు ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు.ఈ ఆందోళనలో తేజ నాయక్, బిచ్ఛానాయక్,రవీందర్,కీర్యా,బిక్కు,వెంకన్న,సికిందర్,నగేష్,బాలాజీ,శీతల,కమ్లి,బజ్జు, మంగమ్మ, సాయి తదితర తండావాసూలు పాల్గొన్నారు.