ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే.. గ్రామసభ నుంచి వెళ్లిపోయారు

ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన గ్రామసభలో సర్పంచ్, ఉపసర్పంచ్ వ్యవహరించిన తీరుపై పొనగండ్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పొనగండ్లలో సోమవారం గ్రామసభ నిర్వహించారు.గ్రామంలోని సమస్యలను ప్రజలు సభ దృష్టికి తీసుకెళ్లి,ప్రజాప్రతినిధులను ప్రశ్నించారు.అయితే ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా సర్పంచ్,ఉపసర్పంచ్ గ్రామసభను మధ్యలోనే వీడి వెళ్లిపోయారని గ్రామస్తులు ఆరోపించారు.అనంతరం పంచాయతీ కార్యదర్శిని నిలదీయగా.. ‘‘సర్పంచ్ వెళ్లిపోయారు.. నేనేం చేయాలి’’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని వారు మండిపడ్డారు.ప్రజా సమస్యలపై నిర్వహించే గ్రామసభకు ప్రజాప్రతినిధులు,అధికారులు బాధ్యతగా హాజరై సమస్యలకు పరిష్కారం చూపాల్సి ఉండగా.. ఇలా మధ్యలోనే వెళ్లిపోవడం బాధ్యతారాహిత్యమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
