అక్రమ మద్యం విక్రయాలపై గ్రామపంచాయతీ కొరడా

ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామపంచాయతీ పరిధిలో అనధికారికంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులు, అక్రమ మద్యం విక్రయ కేంద్రాలను అరికట్టి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామపంచాయతీ తరఫున ధర్మసాగర్ మండల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులకు వినతిపత్రం అందజేశారు.గ్రామపంచాయతీ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో అనధికారికంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ మద్యం విక్రయాలు చేస్తున్నట్లు గ్రామ ప్రజల ద్వారా సమాచారం అందిందని తెలిపారు. ఈ విధమైన అక్రమ మద్యం విక్రయాల వల్ల మహిళలు, పిల్లలు, వృద్ధులు, యువతపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు, సామాజిక సమస్యలు తలెత్తే పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు.మద్యం సేవించి బహిరంగ ప్రదేశాల్లో గొడవలకు పాల్పడటం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశాలు ఉండటంతో గ్రామపంచాయతీ పాలకవర్గం ఈ అంశంపై చర్చించింది. అనధికారిక బెల్ట్ షాపులు, అక్రమ మద్యం విక్రయ కేంద్రాలపై ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు నిర్వహించాలని కోరారు.నారాయణగిరి గ్రామపంచాయతీ పరిధిలో అనధికారికంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులు, అక్రమ మద్యం విక్రయ కేంద్రాలను గుర్తించి, నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఇలాంటి అక్రమ మద్యం విక్రయాలు జరగకుండా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని కోరారు.గ్రామంలో శాంతిభద్రతలకు, ప్రజల ఆరోగ్యానికి ఇబ్బందులు కలిగించే అక్రమ మద్యం విక్రయాలను అరికట్టేందుకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని సర్పంచ్ రేణుక కుమారస్వామి,ఉప సర్పంచ్ మల్లేపరెడ్డి సంధ్య, వార్డ్ మెంబర్లు కోరారు.
