స్కూల్ రోడ్లలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి

జీబ్రా క్రాసింగ్లు ఏర్పాటు చేసి విద్యార్థుల భద్రతకు చర్యలు తీసుకోవాలి
సత్తుపల్లి పట్టణంలోని కాకరపల్లి రోడ్డులోని నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాల, విద్యానగర్ రోడ్డులోని వాణి విద్యాలయం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉన్నప్పటికీ విద్యార్థుల భద్రతకు తగిన చర్యలు లేకపోవడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పాఠశాలల ప్రారంభ, ముగింపు సమయాల్లో విద్యార్థులు, పాఠశాల బస్సులు, తల్లిదండ్రుల వాహనాలతో ఆయా రోడ్లలో రద్దీ పెరుగుతోంది. మధ్యాహ్న సమయంలో చిన్నారులకు భోజనం పెట్టేందుకు తల్లిదండ్రులు రావడంతో ట్రాఫిక్ మరింత పెరుగుతోంది.
పాఠశాలల సమీపంలో వేగ నియంత్రణ కోసం స్పీడ్ బ్రేకర్లు, విద్యార్థులు సురక్షితంగా రోడ్డు దాటేందుకు జీబ్రా క్రాసింగ్లు లేకపోవడంతో ప్రమాదాల ముప్పు ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. సంబంధిత అధికారులు వెంటనే ఆయా ప్రాంతాలను పరిశీలించి స్పీడ్ బ్రేకర్లు, జీబ్రా క్రాసింగ్లు ఏర్పాటు చేసి విద్యార్థుల భద్రతకు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు.
